తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు.. అల్లాడుతున్న ప్రజలు

తెలంగాణలో భానుడు మండిపోతున్నాడు. జనంపై నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వీచిన వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పది మండలాల్లో 45-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

మెదక్ జిల్లా కొల్చారానికి చెందిన 56 ఏళ్ల అజీమొద్దీన్ వడదెబ్బతో మృతి చెందారు. మూడు రోజులక్రితం వడదెబ్బకు గురికాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. అజీమొద్దీన్ పలు దినపత్రికల్లో విలేకరిగా పనిచేశారు.

Telangana
Summer
Temperatures
Heat Waves

More Telugu News